24 December 2018

ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనేమో


ఇప్పటికిప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయకపోయినా వచ్చే నష్టం అంతగాలేదు. అయితే కేసీఆర్ మాత్రం ఆ పని మీద టూరేశాడు. కేబినెట్ ఏర్పాటు అంశాన్ని మాత్రం అంత సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి పక్షంరోజులు గడుస్తున్నా.. కేబినెట్ మాత్రం ఏర్పాటు కాలేదు.

తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి కేసీఆర్ పని అయిపోయిందన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి, కేబినెట్ ఏర్పాటును లైట్ తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనేమో అనుకోవాల్సి వస్తోంది.

ఇక జనవరి నాలుగో తేదీలోగా కేబినెట్ ను ఏర్పాటు చేయకపోతే.. ఆ తర్వాత ముహూర్తాలే లేవని అంటున్నారు. ఫిబ్రవరి వరకూ కొత్త కేబినెట్ కొలువుదీరే అవకాశాలు లేవని చెబుతున్నారు. ముహూర్తాలకు చాలా విలువను ఇచ్చే కేసీఆర్ ఫిబ్రవరి వరకూ కేబినెట్ ను ఏర్పాటు చేయకపోవచ్చునేమో! ప్రస్తుతానికి అయితే కేబినెట్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ తీరు మిస్టరీగానే ఉంది.

దానిపై తెరాస నేతలు కూడా ధైర్యం చేయడంలేదు. కేసీఆర్ సచివాలయానికి రాడు, ఫామ్ హౌస్ లో రెస్టు తీసుకుంటూ ఉంటాడు.. అంటూ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇప్పుడు ఆయన కేబినెట్ ఏర్పాటు విషయంలో కూడా లైట్ తీసుకోవడంపై ప్రతిపక్షాలు మరింతగా విరుచుకుపడేవి. అయితే.. ఎన్నికల్లో ఆ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. దీంతో ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాయి.

కేసీఆర్ సెక్రటేరియట్ కు వెళ్లకపోతేనేం.. కేబినెట్ ఏర్పాటు కాకపోతేనేం.. ప్రజలకు అందేవి అందుతున్నాయి.. ఇంకేం సమస్య ఉంది? అనేది తెరాస వాదన. ప్రజలు తెరాసకే పట్టంకట్టారు కాబట్టి.. వీళ్ల వాదనకు తిరుగు లేదిక